హైదరాబాద్ (మెట్రో న్యూస్):
- సీఎం రేవంత్ రెడ్డి విషప్రచారం
- కేసీఆర్కు క్షమాపణ చెప్పాలి
- కుటుంబ ఆస్తులపై విచారణకు ముఖ్యమంత్రి సిద్దమా
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్
మొన్నటిదాకా రేవంత్ రెడ్డి 1,000 ఎకరాల్లో కేసీఆర్ ఫామ్ హౌజ్ ఉందని బురదజల్లారు. నిన్న అసెంబ్లీ సాక్షిగా కేవలం 67 ఎకరాలు మాత్రమే అని ఒప్పుకున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇంతకాలం వెయ్యి ఎకరాల ఫామ్ హౌజ్ అని విషప్రచారం చేసినందుకు కేసీఆర్కు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పుట్టిన నాటి నుంచి నేటిదాకా.. మా కుటుంబం ఆస్తులెన్ని, రేవంత్ రెడ్డి పుట్టిన నాటి నుంచి నేటి దాకా.. అతని కుటుంబ ఆస్తులు ఎన్ని అనే దానిపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణకు సిద్ధం అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమా అని సవాల్ చేశారు. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
కేసీఆర్ ప్రతి ఎన్నికల సందర్భంగా అఫిడవిట్లో అన్ని వివరాలు పొందుపరిచారు. వ్యవసాయం అంటే కేసీఆర్ మొదటి నుంచి మక్కువ ఎక్కువ. భూమిని ఆయన దేవతలా కొలుస్తారు. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా వ్యవసాయం చేశారు. రేవంత్ రెడ్డి లాగా భూమిని ఆటవస్తువుగా చూడలేదు. చట్ట ప్రకారం కొనుగోలు చేసిన భూములపై బురదజల్లే కుట్రలో రేవంత్ సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. కేసీఆర్ తండ్రికి వందల ఎకరాల భూమి ఉండేది. కేసీఆర్ పుట్టినప్పుడే ఆయన ఇళ్లు రెండు ఎకరాల్లో ఉండేది. చింతమడకలో ఉన్న రెండెకరాల ఇంటిని కూడా ప్రభుత్వ పాఠశాలకు రాసిచ్చారు. ప్రగతి భవన్లో 150 బెడ్ రూంలు ఉన్నాయని.. బంగారు బాత్రూంలు ఉన్నాయని చేసిన వ్యాఖ్యల్లో ఎంత నిజం ఉందో.. నిన్న రేవంత్ చేసిన ఆరోపణల్లో కూడా అంతే నిజం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.