- అసెంబ్లీ వేదిక నుంచే పొలిటికల్ బాంబ్
- దేశంలో ఎవ్వరూ చేయని సాహసం
- ముఖ్యమంత్రి డేరింగ్పై సర్వత్రా చర్చ
రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు సర్వసాధారణం. ఆరోపణలు లేని రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉంటారు. ఒకప్పుడు సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. అక్రమ సంపాదన కోసమే రాజకీయాల్లోకి వస్తున్న రోజులివి… పాలిటిక్స్లో సైద్ధాంతిక వైరుధ్యాలు కామన్… పైకి తిట్టుకున్నా… లోపల కలిసే ఉంటారన్న ఫీలింగ్… పార్టీ వేదికలపై, చట్టసభలలో మాత్రమే విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం కనిపిస్తుంది. రాజకీయ మనుగడ కోసం… ఇష్టం ఉన్నా… లేకపోయినా… అవతలి పార్టీలను, లీడర్లను పొట్టుపొట్టు తిట్టాల్సిందే… నాయకులు ఏ పార్టీలో ఉన్నా.. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అందుకే ఇవ్వాలో పార్టీలో ఉంటే… రేపు మరో పార్టీలో ప్రత్యక్షమవుతారు.
ఇపుడైతే ఒక పార్టీ టిక్కెట్పై గెలిచి… నిసిగ్గుగా పార్టీలే ఫిరాయిస్తున్న సందర్భం. రాజకీయాంటే అంతేగా అంతేగా అనుకుంటున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రాజకీయ అవినీతిపై ఏకంగా బ్రహ్మాస్త్రాన్నే వదలడం పెను సంచలనానికి కారణమైంది.
ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది! సీఎం బ్రహ్మాస్త్రం ఎక్కుపెట్టింది ఎవ్వరిమీదో కాదు… తెలంగాణ సాధకుడిగా గౌరవం పొందిన సాక్షాత్తు కేసీఆర్పైనే..! దాదాపు పదేళ్లు తెలంగాణకు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి పేనే కావడంతోనే అంతా అవాక్కయ్యారు. అది కూడా అసెంబ్లీ వేదికగా కావడం… దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. కేసీఆర్ పార్టీనే ఖంగుతినిపించి అధికార పగ్గాలు చేపట్టిన ఎనుముల రేవంత్ రెడ్డి.. అవకాశం దొరికినప్పుడల్లా… మాజీ ముఖ్యమంత్రిని విమర్శిస్తునే ఉన్నారు. వారి దోపిడీని ప్రస్తావిస్తున్నారు. దానికి కేటీఆర్, హరీశ్రావులు కౌంటర్ ఇవ్వడం… సీఎం సోదరులు… బంధుప్రీతి.. కుంభకోణాలంటూ ఎదురుదాడికి దిగడం కూడా చూశాం. ఇక లాభం లేదని గ్రహించిన సీఎం… తానే స్వయంగా రంగప్రవేశం చేసి… రఫ్పాడించారు.
పొలిటీషియన్ల అవినీతి భాగోతాలను బయటపెట్టడానికి మన దేశంలో సీబీఐ, ఐటీ, ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కనుసన్నలలోనే ఈ సంస్థలు పనిచేస్తాయనే విమర్శలు కూడా ఉన్నాయి. రాజకీయ ఉద్దండులు ములాయం సింగ్, లాలూ ప్రసాద్యాదవ్, దేవెగౌడ, శివసేన థాక్రే, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, సొరేన్ విషయంలోనూ దర్యాప్తు సంస్థల దూకుడు తెల్సిందే. కానీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి… కలలో కూడా ఎవ్వరూ ఊహించని విధంగా… డేరింగ్ చేశారు. అసెంబ్లీలోనే తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు… ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర అవినీతి అరోపణలు గుప్పించారు. అ కుటుంబం లక్షకోట్ల భూదోపిడీకి పాల్పడిందన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసుకొని… ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని బాంబు వేశారు. చెప్పాలంటే… ఒక టైం బాంబు… అది పేలకముందే… కల్వకుంట్ల కుటుంబం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గిలగిలా కొట్టుకుంటోంది.
అధికార కాంగ్రెస్ను… రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేందుకు… ఎన్నో ఎన్నెన్నో కుంభకోణాల గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ వచ్చారు. కేసీఆర్ అవసరం లేదు… తాము చాలు అంటూ బీరాలు పోయారు. ఈ క్రమంలోనే పలువురు మంత్రులపైనా ఆరోపణలు వచ్చాయి. సీఎం సోదరులపైనా ఫోకస్ పెరిగింది. ఇప్పటికే కసిదీరా కేసీఆర్ను, ఆయన కొడుకు, అల్లుడిని తూర్పారపడుతున్న రేవంత్… ఇక ఉపేక్షించి లాభం లేదు అనుకున్నారేమో… అందుకే ఎదురుదాడికి అసెంబ్లీనే కేంద్రంగా చేసుకున్నారు. ప్రధాన ప్రతిపక్షంపై ఉరుములు, మెరుపులతో విరుచుకుపడ్డారు. ఫామ్హౌస్ భూములను స్వాధీనం చేసుకోవాలని, ఆ ప్రభుత్వ భూములను దళితులకే పంచుతామని ప్రకటించి తొలి ముఖ్యమంత్రికి కంటిమీద కునుకు లేకుండా చేశారు. విచారణ, భూముల స్వాధీనం బాధ్యతలు మంత్రులు, అధికారులకు ఇవ్వడంతో… ఈ వ్యవహారం చివరకు ఎటు దారితీస్తుందోనని ఆసక్తి నెలకొంది.