హైదరాబాద్ (మెట్రో న్యూస్):
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆయనకు తెలంగాణ ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాజీవితంలో 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రిని అభినందించారు. దేశ సేవకు మోదీ అంకితమైన సుదీర్ఘ ప్రజాజీవితాన్ని గవర్నర్ కొనియాడారు. ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని లోక్భవన్లోని సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని గవర్నర్ గురువారం ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
రక్తదానం అత్యంత గొప్ప మానవతా సేవల్లో ఒకటని గవర్నర్ అన్నారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, వైద్యరంగంలో ఎన్నో అభివృద్ధులు జరిగినప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం తప్పదని పేర్కొన్నారు. ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం ఎంతో దోహదపడుతుందని, ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదాతలను గవర్నర్ అభినందించి, వారికి పండ్లు, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శి కొమండూరు శశి కిరణాచారి, ఐఆర్ఎస్ రాష్ట్ర శాఖ జెనరల్ సెక్రటరీ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.