హైదరాబాద్ (మెట్రో న్యూస్) :
ఆరోగ్యవంతమైన ప్రజలతోనే అభివృద్ధి చెందిన, వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC) ఆధ్వర్యంలో హైదరాబాద్ గగన్మహల్లోని ఏవీ కాలేజ్ గ్రౌండ్స్లో నిర్వహించిన ‘పోషణ్ మాహ్-2026’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రత, ఫిట్నెస్పై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజా ఉద్యమంగా మారాలని ఆకాంక్షించారు. యువత, విద్యార్థులు, మహిళలు, పిల్లలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కిషన్ రెడ్డి సూచించారు. నూనె, చక్కెర, జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించి ఇంటి ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, నిత్యం వ్యాయామం, యోగా, క్రీడలు, నడకను అలవాటు చేసుకోవాలని కోరారు. సెల్ఫోన్, డిజిటల్ పరికరాల వినియోగాన్ని పరిమితం చేసి సమయానికి నిద్రపోవాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని, డ్రగ్స్ నిర్మూలనలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు, పోలీసులు, సమాజం సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.‘ఫిట్ ఇండియా’, ‘నశా ముక్త్ భారత్’ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కుటుంబం, కాలేజీ, గ్రామం, బస్తీ స్థాయిలో ఆరోగ్య అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ వాలంటీర్గా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన సమాజం, శక్తివంతమైన యువతతోనే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించగలమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.