Take a fresh look at your lifestyle.

గొప్ప ఆల్‌రౌండర్ కావాలన్నదే నా కల: నితీశ్ రెడ్డి

0 3
  • ఆఫ్ఘనిస్థాన్‌తో రెండో టీ20లో భారత్ ఘనవిజయం
  • మూడు వికెట్లతో రాణించిన నితీశ్‌కుమార్‌రెడ్డి
  • కఠోర శ్రమ తనలో ఆత్మవిశ్వాసం పెంచిందన్న పేసర్

యువ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డి అద్భుత ప్రదర్శనతో ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్‌కు సిరీస్ విజయాన్ని అందించాడు. మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో మూడు కీలక వికెట్లు పడగొట్టి జట్టు గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ విజయంతో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో నితీశ్‌రెడ్డి 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనకు గాను అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం నితీశ్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదగాలన్నది తన కల అని చెప్పాడు. “గొప్ప ఆల్‌రౌండర్ కావాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. దానికోసం బౌలింగ్‌లో అదనపు పేస్ అవసరం. ప్రస్తుతం ఆ వేగాన్ని అందుకుంటున్నాను” అని తెలిపాడు. గాయం తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేసిన కఠోర శ్రమ తనలో ఆత్మవిశ్వాసం నింపిందని, ప్రస్తుతం తన ఫిట్‌నెస్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నానని వివరించాడు.

కీలక స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయంతో సిరీస్‌కు దూరమైన తరుణంలో నితీశ్ బంతితో రాణించడం జట్టుకు మరింత బలాన్నిచ్చింది. తన సామర్థ్యంపై నమ్మకం ఉంచడం వల్లే పునరాగమనం సాధ్యమైందని అతడు పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 159 పరుగులు చేయగా, భారత్ 7 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. సంజూ శాంసన్ (22 బంతుల్లో 57), అభిషేక్ శర్మ (19 బంతుల్లో 39) మెరుపు ఇన్నింగ్స్‌లతో విజయాన్ని సులువు చేశారు.

Leave A Reply

Your email address will not be published.