హైదరాబాద్ (మెట్రో న్యూస్):
52 కోట్ల వ్యయంతో 400 మీటర్ల పొడవైన బ్రిడ్జి నిర్మాణం..


అంబర్పేట నియోజకవర్గం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటోంది.. ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు లేవు.. మూసీ మురికి ఒక వైపు, వరదలు మరో వైపు అంబర్పేటను ఇబ్బందిపెడుతున్నాయి.. చిన్న వర్షం వచ్చినా మూసారాంబాగ్ బ్రిడ్జిపై వరద వచ్చేది.. అనేక మంది ప్రాణాలు పోయాయి.. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు ఎందుకు బ్రిడ్జి కట్టలేదు..? రెండేళ్లలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించుకున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అంబర్పేట పరిధిలోని మూసారంబాగ్ బ్రిడ్జిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. 52 కోట్ల వ్యయంతో 400 మీటర్ల పొడవైన బ్రిడ్జి నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మూసీలో లక్షా యాభై వేల క్యూసెక్కుల వరద వచ్చినా ఇబ్బంది తలెత్తకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం విశేషం. ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, శ్రీ గణేష్, నవీన్ యాదవ్, మల్ రెడ్డి రంగా రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ను తిలకించారు.