(మెట్రో న్యూస్):
మానవ జాతి బానిసత్వం నుండి పెట్టుబడిదారీ కబంధహస్తాల నుండి విముక్తి చెందాలని అందుకు మార్క్సిజమే దోహదకారి అని నమ్మిన ప్రపంచ మేధావి సీతారాం ఏచూరి జీవితం త్యాగాల మయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు . శనివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ సోషలిజమే మానవాళి విముక్తికి దోహదకారి అని కారల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతాన్ని పునికి పుచ్చుకున్న ప్రపంచం మెచ్చిన కమ్యూనిస్టు మేధావి సీతారాం ఏచూరి అని అన్నారు. దేశంలో మతోన్మాద శక్తులు పెరగకుండా లౌకిక తత్వానికి హాని కలగకుండా పోరాటాలకు ఆయన రూపకల్పన చేశారన్నారు. పార్లమెంట్లో సభ్యుడుగా ఎన్నికై ప్రజావాణిని వినిపించిన గొప్ప నాయకుడని అన్నారు.
నేటి పాలకులు ఆయన రూపొందించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ఎండగట్టాలని వారు కోరారు. కమ్యూనిస్టు పార్టీ నుండి దేశ ప్రతినిధిగా అనేక అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొని కమ్యూనిజం విశిష్టతను ప్రపంచానికి చాటాడని ఆయన తెలిపారు. పార్లమెంట్లో ఏ చూరి ఉండాలని అందుకు తమ పార్టీ నుండి ఎన్నిక చేస్తావని కాంగ్రెస్ అధిష్టానం చెప్పినప్పటికీ దాన్ని తృణప్రాయంగా భావించి వదిలివేసిన మహా వ్యక్తి అని అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు రాగిరెడ్డి మంగారెడ్డి, రవి నాయక్, పట్టణ కార్యదర్శి మల్లు గౌతమ్ రెడ్డి, భావండ్ల పాండు,సిఐటీయు తిరుపతి రామ్మూర్తి,సిపిఎం నాయకులు జీవీ రెడ్డి, రమేష్,రామకృష్ణ, టాప్రా నాయకులు కేశవులు రెడ్డి ల్యాబ్ సిఐటియు నాయకులు శ్రీనివాసరావు, వేణు, బుడిగ రాములు తదితరులు పాల్గొన్నారు.