ఢిల్లీ (మెట్రో న్యూస్):
రాష్ట్ర ప్రభుత్వం నిరాశ నిస్పృహల్లో ఉంది… అందుకే ప్రతిరోజు అటెన్షన్ డైవర్షన్కి పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. వెయ్యి రోజుల to తర్వాత మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈ దాడులకు తెగబడుతున్నదన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ, తన పిఆర్ఓ మహేష్ ముదిరాజ్, పిఏ మహేందర్ రెడ్డిలపై పోలీస్ స్టేషన్ లోపల జరిగిన దాడిని ఖండించారు. ప్రాణాలకు లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన నాయకుడి ఇంటిపైన దాడి జరిగిందన్నారు. ఆ తర్వాత దాడిని ఆపడానికి మేము వెళ్తే మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెడితే మా మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించారు.
ఈసారి పోలీస్ స్టేషన్ లోపల తన పి.ఆర్.ఓ ని, పి.ఏలను ఇద్దరిని పోలీస్ స్టేషన్ లోపలనే 15 మందితో దాడికి ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. పోలీస్ స్టేషన్లో దాడికి ప్రయత్నించింది గుండాలా? పోలీసులా? మఫ్టీలో వచ్చి దాడి చేసిన వారు ఎవరో తేలాలి అన్నారు. తమ వారిపై జరిగిన దాడి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయమంటే కూడా చేయలేదని.. తెలంగాణలో పోలీస్ శాఖ కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా పని చేస్తుందని ఆగ్రహించారు. తమ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కోరినా… ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేని ఘోరమైన పరిస్థితి తెలంగాణలో నెలకొని ఉన్నదని మండిపడ్డారు. ఈ అంశంలో కోర్టులను ఆశ్రయిస్తాము… కోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు.