- రేపు చెన్నైలో ఘనంగా ప్రారంభోత్సవం
- ముఖ్య అతిథిగా హాజరుకానున్న నటుడు కమల్ హాసన్
- గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం
- అనిరుధ్ రవిచందర్ సంగీతం
- నిర్మాతలుగా అల్లు అరవింద్, బన్నీ వాస్, రాక్లైన్ వెంకటేశ్
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన కెరీర్లోనే ఒక ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టును దక్కించుకున్నారు. దిగ్గజ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్లో ఆమె ప్రధాన పాత్ర పోషించనున్నట్లు అధికారికంగా ఖరారైంది. ‘ఎం.ఎస్. – ఎ లెగసీ ఆన్ స్క్రీన్’ అనే టైటిల్తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నటిగా రష్మిక కెరీర్లో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుందని భావిస్తున్నారు.
ఈ చిత్రం ప్రారంభోత్సవాన్ని రేపు (సెప్టెంబర్ 16న) ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 110వ జయంతిని పురస్కరించుకుని చెన్నైలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఇండియన్ కోరల్ ఎన్సెంబుల్ బృందం, సుబ్బులక్ష్మి ఆలపించిన కొన్ని అజరామర గీతాలతో సంగీత నివాళి అర్పించనుంది.
‘జెర్సీ’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్కు దర్శకత్వం వహిస్తుండగా, స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాస్లతో కలిసి ప్రముఖ నిర్మాత రాక్లైన్ వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ పాత్ర కోసం చిత్రబృందం మొదట సాయి పల్లవి, రుక్మిణి వసంత్ వంటి నటీమణులను పరిశీలించింది. అయితే, ఇతర ప్రాజెక్టుల కారణంగా సాయి పల్లవి ఈ అవకాశం వదులుకున్నట్లు సమాచారం. అనంతరం నిర్వహించిన స్క్రీన్ టెస్టులో రష్మికను ఈ పాత్రకు ఎంపిక చేశారు.
భారతరత్న పురస్కార గ్రహీత అయిన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, కేవలం శాస్త్రీయ సంగీతానికే పరిమితం కాలేదు. ఆమె ‘సేవాసదనం’, ‘శకుంతలై’, ‘సావిత్రి’, ‘మీరా’ వంటి చిత్రాల్లో నటించి నటిగా కూడా తనదైన ముద్ర వేశారు. అలాంటి గొప్ప వ్యక్తి పాత్రను పోషించడం రష్మికకు నటిగా అతిపెద్ద సవాల్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక, రష్మిక నటిస్తున్న ఇతర సినిమాల విషయానికొస్తే.. యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ నవంబర్ 27న విడుదల కానుండగా, విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.