హైదరాబాద్ (మెట్రో న్యూస్):
అసెంబ్లీ సమావేశాల తొలిరోజు జరిగిన తోపులాటలో సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే దుర్మార్గంగా వ్యవహరించారని మంత్రి సీతక్క ఆరోపించారు. అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించారన్నారు. బుధవారం మీడియాతో చిట్ చాట్ చేసిన మంత్రి సీతక్క… దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు.
బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి కోవలక్ష్మిలను వెనక నుండి ఆ పార్టీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డిలు తోసేశారని చెప్పారు. గంగుల కమలాకర్ మహిళా ఎమ్మెల్యేలను వెనకనుంచి నెట్టుకుంటూ ముందటికి వచ్చారు. పక్కపక్కన నిలుచున్న ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల మధ్య లోకి, తాకుకుంటూ వచ్చారు. ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల మధ్యకు చొరబడాల్సిన అవసరం సుధీర్ రెడ్డికి ఏముంది. మహిళా ఎమ్మెల్యేలను అతుక్కుని నిలబడాల్సిన అవసరం సుదీర్ రెడ్డికి ఏముంది అన్నారు. కోవ లక్ష్మి, సబితమ్మ మీద చెయ్యి వేశారని నిందించారు. నవీన్ రెడ్డి నెట్టుకుంటూ పోయినపుడు ఆ మహిళ ఎమ్మెల్యేలు అయ్యో అని అరిచారని తెలిపారు. ఆడబిడ్డల పట్ల అసభ్య ప్రవర్తనను ఖండించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది కీచక పర్వం అని సీతక్క ఆగ్రహించారు.