హైదరాబాద్ (మెట్రో న్యూస్):
- ఫాస్ట్ట్రాక్లో దేవాదుల పూర్తి
- భూనిర్వాసితులకు త్వరలో పరిహారం
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

దేవాదుల పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు నీటి పారుదల మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఆదేశించారు. రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించేందుకు దేవాదులను ఫాస్ట్ట్రాక్పై పూర్తి చేస్తాం అని వెల్లడించారు. దేవాదుల పూర్తికి అడ్డుగా ఉన్న ప్రతి సమస్యను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మంగళవారం నాడు జలసౌధలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దలసరి అనసూయ సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వెంనరేందర్ రెడ్డి, లోకసభ సభ్యులు బలరాం నాయక్,దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని శాసన సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ, భూసేకరణ, ఆర్అండ్ఆర్, అటవీ అనుమతుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయిన చోట నిధుల విడుదలలో ఒక్కరోజు కూడా జాప్యం ఉండొద్దన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ తదితర అవసరాలకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీకి సీఎం హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ రూ.6,000 కోట్లలో ఇప్పటికే సుమారు రూ.2,500 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. నిధులు విడుదల చేయడమే కాదు… పరిహారం రైతుల చేతికి సకాలంలో చేరడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. కలెక్టర్లు, నీటిపారుదల ఇంజినీర్లు సమన్వయంతో పనిచేసి భూసేకరణ సమస్యలు పరిష్కరించాలన్నారు. దేవాదుల ద్వారా సుమారు 38 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసే లక్ష్యంతో నిర్మిస్తున్నట్టు వివరించారు. దాదాపు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే దేవాదుల ప్రాజెక్టు లక్ష్యం అని పేర్కొన్నారు. దేవాదుల ఫలాలను సాధ్యమైనంత త్వరగా రైతుల పొలాలకు చేరుస్తామన్నారు.