22ఏపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
ఈ వ్యవహారంలో ఏ-1 రేవంత్, ఏ-2 పొంగులేటి!
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
సెప్టెంబర్ 7న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. దద్దరిల్లేలా సభను స్తంభింపజేసి అయినా బాధితుల సమస్యలు పరిష్కారం అయ్యేలా కొట్లాడుతాం అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాత్రికి రాత్రి చేసిన తప్పుకు ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలన్నారు.ఈ వ్యవహారం వెనుక వందకు వంద శాతం రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉంది కాబట్టే ఆయన సైలెంట్గా ఉన్నారని తెలిపారు. ఈ భూములను ఎవరు నిషేధిత జాబితాలో పెట్టమన్నారో తేల్చడానికి వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాను సీక్రెట్గా ఎందుకు ఉంచుతున్నారు.. వెబ్సైట్లో జాబితాను ఎందుకు బ్లాక్ చేశారు? ప్రభుత్వం వెంటనే ఈ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిలదీశారు. ప్రజల భూములతో చెలగాటమాడుతూ వారిని నిద్ర లేకుండా చేసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటిని ముఖ్యమంత్రి తక్షణమే బర్తరఫ్ చేయాలన్నారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ ఎం.జే. గార్డెన్స్లో 22ఏ నిషేధిత భూముల సమస్యతో ఇబ్బంది పడుతున్న బాధిత కుటుంబాలతో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం చేసిన తప్పుకు కార్యాలయాల చుట్టూ సామాన్య ప్రజలు ఎందుకు తిరగాలి? ఈ సమస్య కేవలం హైదరాబాద్కే పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి ఎకరాల వ్యవసాయ భూములను కూడా 22ఏలో పెట్టారు. ఈ 22ఏ కుట్ర వెనుక భారీ కమీషన్ల బాగోతం దాగి ఉంది. దీనికి ఏ-1 రేవంత్ రెడ్డి, ఏ-2 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి… ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే కంచే చేను మేసినట్లుగా తయారై ఆస్తులను లాక్కుని ఆగం చేస్తోంది. ఈ కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది. ఆడపిల్లల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కరువైందని హరీశ్రావు మండిపడ్డారు.