Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌లో అతిపెద్ద ఏఐ డాటా సెంటర్‌

0 7

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డాటా సెంటర్‌ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్టు టీసీఎస్‌ అనుబంధ సంస్థ హైపర్‌ వాల్ట్‌ ప్రకటించింది. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ మేరకు శనివారం టీసీఎస్‌ ప్రతినిధుల బృందం సీఎం రేవంత్‌ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబులతో సచివాలయంలో సమావేశమై ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

హైదరాబాద్‌లో 264 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1 గిగావాట్ల సామర్థ్యంతో ఈ అత్యాధునిక ఏఐ డాటా సెంటర్‌ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించాయి. హైపర్‌వాల్ట్‌తో పాటు భాగస్వామ్య సంస్థలు ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణకు దాదాపు రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి.

ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నట్టు టీసీఎస్‌ సీఈవో, ఎండీ కే కృతివాసన్‌ తెలిపారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలు, హైపర్‌ స్కేలర్లు, గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు అవసరమైన భారీ కంప్యూటింగ్‌ మౌలిక వసతులను ఈ క్యాంపస్‌ అందించనున్నట్టు చెప్పారు. అధిక సామర్థ్యమున్న కంప్యూటింగ్‌ వ్యవస్థలు, లిక్విడ్‌ కూలింగ్‌ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దనున్నారు.

దేశంలోని అత్యంత అధునాతన, అతిపెద్ద ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ క్యాంపస్‌లలో ఇది ఒకటిగా నిలువనున్నది. ఈ భారీ పెట్టుబడి ద్వారా ఏఐ, డాటా సెంటర్ల రంగంతో పాటు విద్యుత్తు, కూలింగ్‌, నెట్‌వర్కింగ్‌, నిర్మాణం, ఇంజినీరింగ్‌, ఆపరేషన్స్‌ వంటి అనుబంధ రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. పర్యవరణానికి అనుకూలంగా గ్రీన్‌ ఎనర్జీ, వాటర్‌-న్యూట్రల్‌ డిజైన్‌తో ఈ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, సీఎస్‌ సంజయ్‌ జాజు, ప్రభుత్వ సలహాదారు కే రామకృష్ణరావు, టీసీఎస్‌ సీవోవో ఆర్తి సుబ్రమణియన్‌, హైపర్‌ వాల్ట్‌ ప్రెసిడెంట్‌ వీ రాజన్న, సీఈవో, ఎండీ దీపేష్‌ నందా పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.