మెట్రో న్యూస్:
రాజన్న సిరిసిల్ల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ అనంతరం జిల్లా కలెక్టర్ మంగళవారం ఆవరణ మొత్తం పరిశీలించారు.
అన్ని షెడ్లు పరిశీలించి.. ఒక్కో షెడ్లో ఎన్ని కోడెలు ఉంటాయి? వాటికి ఎండు, పచ్చి గడ్డి, దానా పై ఆరా తీశారు. ఆవులు ఎన్ని ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. వాటికి సమయానుసారంగా పశుగ్రాసం, నీరు, దానా ఇవ్వాలని ఆదేశించారు. గోశాల ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. అనారోగ్యం, ఇతర కారణాలతో ఉన్న జీవాలను ప్రత్యేక షెడ్ లో సంరక్షించాలని, వాటికి ప్రత్యేక దానా, వైద్యం అందించాలని ఆదేశించారు.
కోడెల షెడ్లలో ఇంకా కావలసిన కూలర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
కార్యక్రమంలో ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి శ్రీధర్, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.