- అసెంబ్లీలో తాతా మధు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
- హరీశ్ రావుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆగ్రహం
- మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై హరీశ్ ఫిర్యాదు
- ఘటనపై విచారణకు ఆదేశించామని స్పీకర్ వెల్లడి
- తన తల్లిపై వ్యాఖ్యలపై హరీశ్ను నిలదీసిన స్పీకర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు కూడా వాడీవేడిగా సాగుతోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు సభలో తీవ్ర దుమారం రేపాయి. ఈ అంశంపై చర్చ జరుగుతుండగా బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హరీశ్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డితో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. మహిళా నేతలపై దాడి జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అదే సమయంలో తాతా మధు తన తల్లిపై చేసిన వ్యాఖ్యల అంశాన్ని స్పీకర్ ప్రస్తావించారు. ‘‘నా తల్లిని అవమానించిన అంశంపై ఏం చెబుతారు?’’ అంటూ హరీశ్ రావును ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే స్పీకర్, హరీశ్ రావు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
మరోవైపు మంత్రి సీతక్క కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. స్పీకర్ తల్లిని అవమానిస్తే ప్రధాన ప్రతిపక్షం కనీసం విచారం వ్యక్తం చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. మహిళా పోలీసుల ఎదుట బీఆర్ఎస్ నేతలు చొక్కాలు విప్పి విసిరేశారని ఆరోపించారు. అంతేకాకుండా వారిపై దాడికి కూడా పాల్పడ్డారని అన్నారు.