హైదరాబాద్ : మెట్రో న్యూస్
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానాలు ఇచ్చారు. ఆర్టీసీ పరిస్థితి, సంస్థను బలోపేతం చేసే చర్యలు, ఉద్యోగుల సమస్యలు, బస్సుల నిర్వహణ, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన తదితర అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించగా.ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు.
ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేస్తూనే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తోందని, సంస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. ఉద్యోగుల హక్కులు, సంఘాల వ్యవహారాల విషయంలో చట్టపరమైన ప్రక్రియను అనుసరిస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ముందుకు సాగుతున్నట్లు కూడా మంత్రి పొన్నం ప్రకటించారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం కూడా అసెంబ్లీ లో ప్రస్థావించారు సంస్థలో ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతూ తదుపరి చర్యలు చేపట్టే దిశగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మంత్రి వివరించారు.
యూనియన్ ఎన్నికల అనంతరం విలీనంపై చర్చలు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్య, సేవల విస్తరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. ఆర్టీసీని కేవలం ప్రభుత్వ రంగ సంస్థగా కాకుండా ప్రజలకు నమ్మకమైన ప్రజా రవాణా వ్యవస్థగా మరింత బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.