ADILABAD: కుప్టి వంతెన వద్ద లారీ, ట్యాంకర్ ఢీకొనడంతో NH-44పై రాకపోకలు స్తంభించి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇచ్చోడ, నేరేడిగొండ ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో కుప్టి వంతెన సమీపంలో రోడ్డు ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జాతీయ రహదారిపై టమాటా లోడ్తో వెళ్తున్న లారీ, మరో లారీ ఢీకొని బోల్తాపడటంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, నేరేడిగొండ మండలాల పరిధిలోని 44వ జాతీయ రహదారి (NH-44) పై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అర్ధరాత్రి నేరేడిగొండ మండలం కుప్టి వంతెన వద్ద సిమెంట్ మిక్సర్ ట్యాంకర్, టమాటా లోడ్తో వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే ఈ వంతెనకు ఒకవైపు బుంగ పడటంతో రాకపోకలు వన్ వే లో కొనసాగుతుండగా, అదే మార్గంలో ప్రమాదం జరగడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది.
లారీలు ఢీకొన్న ప్రమాదం ప్రభావంతో జాతీయ రహదారిపై ఇరువైపులా దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు వేకువజామునే సంఘటనా స్థలానికి చేరుకుని, క్రేన్ల సాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు. అయినప్పటికీ, మార్గం వన్ వే కావడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అత్యవసరంగా వెళ్లాల్సిన ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవిస్తున్నారు.
ఇచ్చోడ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సులను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే, నేరేడిగొండ మండలం రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద భారీ వాహనాలను నిలిపివేస్తూ ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు గాయపడగా.. సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతున్నారు.