విజయపథంలో వెయ్యి రోజులు
సంక్షేమం నుంచి అభివృద్ధి దాకా…
జాతీయ స్థాయి నుంచి ప్రపంచస్థాయి వరకు
తెలంగాణ అప్రతిహత ప్రస్థానం
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం విజయపథంలో దూసుకెళ్తోంది. సంక్షేమం నుంచి అభివృద్ధి దాకా… జాతీయ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు తెలంగాణ పురోగమిస్తున్నది. ఈ సెప్టెంబర్ 1వ తేదీ నాటికి విజయవంతంగా 1000 రోజుల మైలురాయిని చేరుకోవడం విశేషం. ప్రజల ఆకాంక్షలే పాలనకు కేంద్రబిందువుగా చేసుకుని, సంక్షేమం–అభివృద్ధి–సామాజిక న్యాయాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళుతూ… తెలంగాణ ప్రగతిలో కొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది. అన్ని వర్గాల వారికి లబ్దిచేకూరేలా ఎప్పటికప్పుడు
కొంగొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుడుతూ రేవంత్ సర్కారు ముందుకు సాగుతున్నది.
వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు, విద్య నుంచి వైద్యం వరకు, మహిళా సాధికారత నుంచి యువత ఉపాధి వరకు, సామాజిక న్యాయం నుంచి డిజిటల్ పాలన వరకు ప్రతి రంగంలో ఎన్నో విధానపరమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ వెయ్యి రోజుల ప్రజాపాలన ప్రస్థానంలో అమలు చేసిన ప్రధాన పథకాలు, తీసుకున్న కీలక నిర్ణయాలు, చేసిన కొత్త చట్టాలు, సాధించిన విజయాలు ఎన్నో… ఎన్నెన్నో. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం, రైతులకు ఇచ్చిన ప్రాధాన్యత ముందుగా ప్రస్తావించాలి. 25 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు రూ.2 లక్షల వరకు పంట రుణభారం నుంచి విముక్తి కల్పించింది. పేదలకు సన్నబియ్యం పంపిణీ పథకం చారిత్రాత్మకం. రికార్డు పంటల దిగుపడులు, రికార్డు కొనుగోళ్లు. ఇక మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కీమ్ బంపర్హిట్ అయ్యింది.
కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు, కార్మికులకు కనీస వేతనాల పెంపు, ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ, మహిళా సాధికారత కార్యక్రమాలు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చాయి.. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే, ఎస్సీ ఉపకులాల వర్గీకరణతో పూర్తి చేసి కేంద్రానికే ఆదర్శంగా నిలిచింది. కొత్తగా ఫ్యూచర్ సిటీ తలంపు, క్రీడలకు పెద్దపీట, కల్తీ ఆహారం, డ్రగ్స్పై ఉక్కుపాదం సముచిత నిర్ణాయాలే! విదేశీ పెట్టుబడుల కోసం ఇన్వెస్ట్ తెలంగాణ నినాదం… కచ్చితంగా తెలంగాణ రైజింగ్కు దోహదపడే అంశం.