(మెట్రో న్యూస్)
ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని పలువురు 22ఏ బాధితులు తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన డబ్బుతో ప్లాట్లు కొనుగోలు చేసుకున్నప్పటికీ, వాటిని 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. తమ భూములు, ప్లాట్లపై హక్కులు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం తక్షణమే సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజలు తమ జీవితకాల పొదుపులతో కొనుగోలు చేసుకున్న భూములు, ప్లాట్ల విషయంలో అన్యాయం జరగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 22ఏ సమస్యపై బాధితుల తరఫున బిఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, బాధితులకు న్యాయం జరిగే వరకు వారి వెంట నిలబడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని పలువురు సీనియర్ బిఆర్ఎస్ నాయకులు, 22ఏ బాధిత కాలనీల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.