- స్కైహోప్ ఏవియేషన్, మె హెయిర్ సంస్థలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ఒక్కో వాటర్డ్రోమ్ నిర్మాణానికి రూ. 20 కోట్ల వ్యయం అంచనా
- ఉడాన్ పథకం కింద ఆపరేటర్లకు కేంద్రం ఆర్థిక చేయూత
- మొదటి దశలో విజయవాడ, విశాఖ, శ్రీశైలం వంటి ప్రాంతాల్లో సేవలు
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. రాష్ట్రంలోని కీలక పర్యాటక ప్రాంతాలను జల మార్గాల ద్వారా అనుసంధానించే సీ ప్లేన్ల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టేందుకు స్కైహోప్ ఏవియేషన్, మారిటైం ఎనర్జీ హెలి ఎయిర్ సర్వీసెస్ (మె హెయిర్) సంస్థలు ముందుకు రాగా, కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ వాటి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 10 ప్రాంతాలను గుర్తించారు. విజయవాడ (బెర్మ్ పార్క్), శ్రీశైలం, విశాఖపట్నం, తిరుపతి (రాయలచెరువు), సూర్యలంక, గండికోట, కాకినాడ, అరకు (జోలాపుట్), లంబసింగి (తాజంగి రిజర్వాయర్), పోలవరంలలో సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో వాటర్డ్రోమ్ల (మినీ విమానాశ్రయాలు) నిర్మాణానికి రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) త్వరలో టెండర్లు పిలవనుంది. ఒక్కో వాటర్డ్రోమ్ నిర్మాణానికి సుమారు రూ.20 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఆపరేటర్లుగా సంస్థలు ముందుకు రావడంతో, వాటర్డ్రోమ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే ఆయా సంస్థల ప్రతినిధులు ఈ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు.
గతేడాది విజయవాడలోని బెర్మ్ పార్కు నుంచి శ్రీశైలం వరకు నిర్వహించిన ట్రయల్ రన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా సీ ప్లేన్లో ప్రయాణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రయోగం కార్యరూపం దాల్చనుంది. అయితే, అన్ని ప్రాంతాల్లో ఒకేసారి కాకుండా డిమాండ్ను బట్టి దశలవారీగా సేవలను ప్రారంభించనున్నారు. తొలి దశలో విజయవాడ, శ్రీశైలం, విశాఖపట్నం, లంబసింగి, సూర్యలంక, కాకినాడలో సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టుకు కేంద్రం ‘ఉడాన్’ పథకం కింద ఆర్థిక చేయూత అందించనుంది. ప్రయాణికుల నుంచి ఆదరణ పెరిగే వరకు, ఆపరేటర్లకు సంభవించే నష్టాలను భర్తీ చేసేందుకు లోటు భర్తీ నిధి (వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ – వీజీఎఫ్) కింద తోడ్పాటు అందిస్తుంది. రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుండటంతో సీ ప్లేన్లకు మంచి ఆదరణ లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఇప్పటికే కేరళ, గుజరాత్లలో ఉడాన్ పథకం కింద సీ ప్లేన్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు వాటి సరసన ఆంధ్రప్రదేశ్ కూడా చేరనుంది. ఈ వాటర్డ్రోమ్లను కేవలం సీ ప్లేన్లకే కాకుండా, ఇతర పర్యాటక బోట్ల అవసరాలకు కూడా వినియోగించుకునేలా డిజైన్ చేస్తున్నారు.