హైదరాబాద్ (మెట్రో న్యూస్):
- నేటినుంచి 6 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు
- నీకూ… మాకూ పోలికా… నందికి, పందికి ఉన్నంత తేడా
- ప్రతిపక్ష నేతకు రూ. 22 కోట్ల 24.40 లక్షలు ఖర్చు పెట్టాం
- అంబర్పేట సభలో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి


ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పరిపాలనను నిందిస్తూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ నేతలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. సమస్యలను పట్టించుకోకుండా… ప్రజాసొమ్మును పందికొక్కులా తిని ఫామ్హౌస్ నుంచి బయటకు రాని ప్రతిపక్ష నేత కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని ఎదురుదాడి చేశారు. మంగళవారం నుంచి ఆరు రోజుల పాటు ఊరూరా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆయన సీఎం అయితే కుటుంబ సభ్యులకు, కులస్తులకు పదవులు ఇచ్చుకున్నారని, తాను సీఎం అయ్యాక బడుగులు, దళితులకు పదవులిచ్చి గౌరవించానని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఏడాది పాటు విధులకు రాకపోతే డిస్మిస్ చేస్తారు.. మరి కేసీఆర్ను ఏం చేయాలి..? ఈ 1000 రోజుల్లో కేసీఆర్ కోటి ఇరవై నాలుగు లక్షల నలభై వేల జీతం తీసుకున్నాడు.. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ భద్రత, వసతుల కోసం 21 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. మనమడు ఆస్పత్రికి వెళ్తే, బంధువులు ఎవరైనా చనిపోతే తప్ప కేసీఆర్ బయటకు రాలేదని సీఎం దుయ్యబట్టారు.
సోమవారం నాడు మూసారంబాగ్ వద్ద నిర్మించిన కొత్త వంతెనను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి… అనంతరం అంబర్పేట స్పోర్ట్స్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. ప్రధాన ప్రతిపక్ష నేతపై తీవ్ర స్థాయిలో విరిచుకుపడ్డారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల అరాచకాలు, వారి కుటుంబ ఆస్తులు, వారికి లభించిన రాజకీయ పదవులపై ధ్వజమెత్తారు. నీకూ నాకూ పోలికేంటి అన్నారు. నందికి, పందికి ఉన్నంత తేడా ఉందన్నారు. ప్రధాన ప్రతిపక్షం వైఫల్యం చెందిన రాష్ట్రం తెలంగాణ.. 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ల ఎదురుగానే అన్ని విషయాలు చెప్తా.. తెలంగాణకు న్యాయం చేయాలని అనుకుంటే, నమ్మకం ఉంటే అసెంబ్లీకి కేసీఆర్ రావాలన్నారు. పదేళ్లలో కేసీఆర్ ఏం చేశాడో, 1000 రోజుల్లో తాను ఏం చేశానో అసెంబ్లీలో చర్చకు సిద్ధమన్నారు.
తమ ప్రభుత్వం 2,000 కోట్లతో కొత్త ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తోంది.. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెడతాం.. సనత్నగర్ టిమ్స్కు మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టాం… ఎల్బీ నగర్ టిమ్స్ ఆస్పత్రికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతాం… అల్వాల్ టిమ్స్ ఆస్పత్రికి మాజీ సీఎం అంజయ్య పేరు పెడతాం.. మీ పేర్లు పెట్టాలి, పోతే మీ విగ్రహాలు పెట్టాలన్నదే మీ ఆలోచన.. సెక్రటేరియట్ ముందు రాజీవ్ విగ్రహం తీస్తామంటున్నారు.. ముట్టుకోండి చూస్తాం..సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలన్న ఆలోచన కూడా రాలేదు.. సెక్రటేరియట్ ముందు మేం పెట్టాం.. మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని నెక్లెస్ రోడ్డులో పెట్టాం.. శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మను అనాథలా రోడ్డుమీద పడేస్తే మహిళా కమిషన్ సభ్యురాలిగా చేశాను.. వీరనారి చాకలి ఐలమ్మ పేరు మహిళా యూనివర్సిటీకి పెట్టాను.. నాకు, మీకు పోలికనా..? అంటూ ముఖ్యమంత్రి రేవంత్ ఆగ్రహోదగ్రుడయ్యారు.