హైదరాబాద్ (మెట్రో న్యూస్):
- స్కిల్ క్యాపిటల్గా తెలంగాణ
- స్కిల్లింగ్, అప్స్కిల్లింగ్, రీస్కిల్లింగ్లో భాగస్వామ్యం అవ్వండి
- పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపు
- తెలంగాణను స్కిల్ క్యాపిటల్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్కిల్లింగ్, అప్స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పిలుపునిచ్చారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’గా తెలంగాణ యువతను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. బుధవారం బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణాలో బోయింగ్, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ‘బోయింగ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్’ను విజయవంతంగా పూర్తి చేసిన యువత, దివ్యాంగులు, వెటరన్స్ కు ఆయన ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ… టెక్నాలజీ, ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కూడా ఎప్పటికప్పుడు మారుతున్నాయన్నారు. ఆ దిశగా యువతను తీర్చిదిద్దాలంటే ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు, నిపుణులు, విద్యా సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించాలనే సంకల్పంతో రాష్ట్రంలో స్కిల్లింగ్ ఎకోసిస్టమ్ను బలోపేతం చేస్తున్నామన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నామన్నారు. ఆధునిక, పరిశ్రమ ఆధారిత శిక్షణను అందించేందుకు ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అకడమిక్ కరిక్యులమ్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేయడంతో పాటు అనేక కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టామన్నారు.