Take a fresh look at your lifestyle.

అసెంబ్లీ‌లో ఊహించని పరిణామం.. కంటతడి పెట్టిన స్పీకర్ ప్రసాద్ కుమార్

0 39
  • అసెంబ్లీలో కంటతడి పెట్టిన స్పీకర్‌ ప్రసాద్‌
  • తాతా మధు వ్యాఖ్యలపై సభలో తీవ్ర చర్చ
  • తాతా మధును డిస్మిస్ చేయాలని సీఎం డిమాండ్
  • వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ నేత మహేశ్వర్‌ రెడ్డి
  • స్పీకర్‌ తల్లి ప్రస్తావనపై సీతక్క ఆవేదన

తెలంగాణ అసెంబ్లీలో సోమవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సభా కార్యకలాపాలు కొనసాగుతున్న సమయంలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు రాగా, దీనిపై సభలో చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఉదయం అసెంబ్లీ వెలుపల తాతా మధు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్‌ రెడ్డి సహా పలువురు మంత్రులు సభలో తీవ్రంగా స్పందించారు. స్పీకర్‌ను ఉద్దేశించి అభ్యంతరకరమైన భాషను ఉపయోగించడం చట్టసభల గౌరవాన్ని దెబ్బతీయడమేనని సీఎం అన్నారు. తాతా మధు శాసనమండలి సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సభాపతికి జరిగిన అవమానం సభ్య సమాజానికి జరిగిన అవమానమని రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇలాంటి భాషను చట్టసభల్లో సహించకూడదని స్పష్టం చేశారు.

బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి కూడా తాతా మధు వ్యాఖ్యలను ఖండించారు. స్పీకర్‌పై అనుచిత భాష ఉపయోగించిన సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో ప్రసాద్‌ కుమార్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఛైర్‌లో ఉండగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో సభలో ఒక్కసారిగా ఉద్విగ్న వాతావరణం నెలకొంది.

మంత్రి సీతక్క కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. స్పీకర్‌ తల్లిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాధాకరం అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అణగారిన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు అత్యున్నత పదవుల్లో ఉండటాన్ని కొందరు ఓర్వలేకపోతున్నారని బీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు. తాతా మధును వెంటనే సస్పెండ్‌ చేయాలని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.