Take a fresh look at your lifestyle.

వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల పరిహారం.. ఆగస్టు 31న ప్రాజెక్టు ప్రారంభం

0 14
Chandrababu Naidu fulfills 30 year Veligonda dream distributes 250 crore cheque to displaced families
  • వెలిగొండ నిర్వాసితులకు మూడో విడతగా రూ.250 కోట్ల పరిహారం పంపిణీ
  • ఆగస్టు 31న ప్రాజెక్టు తొలిదశను ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన
  • గత ప్రభుత్వం వల్లే ప్రాజెక్టు పూర్తి చేయడంలో జాప్యం జరిగిందన్న ముఖ్యమంత్రి
  • ఐదు నదుల అనుసంధానంతో దేశంలో నీటి భద్రత సాధ్యమని వెల్లడి
  • మార్కాపురంలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు సెప్టెంబర్‌లో శంకుస్థాపన

దశాబ్దాల నాటి వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. సీఎం చంద్ర‌బాబు నాయుడు మూడో విడత పునరావాస, పునర్నిర్మాణ (ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీ కింద రూ.250 కోట్ల చెక్కును నిర్వాసిత కుటుంబాలకు అందించారు. ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన చారిత్రక ప్రకటన చేశారు. దీంతో ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల 30 ఏళ్ల కల సాకారం కానుంది.

ఇప్పటికే రెండు విడతల్లో పరిహారం అందించిన ప్రభుత్వం, తాజాగా మూడో విడతలో 2,027 కుటుంబాలకు రూ.250 కోట్లు పంపిణీ చేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 6,206 నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్ల మేర పరిహారం అందినట్లయింది. ప్రాజెక్టుకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ పనులు 85 శాతం పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి నిర్వాసితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. అసాధ్యమనుకున్న ప్రాజెక్టును సుసాధ్యం చేసి చూపిస్తున్నామన్నారు. “1996లో నేను శిలాఫలకం వేసిన ఈ ప్రాజెక్టును 2026లో ప్రారంభించుకోవడం నా అదృష్టం. గత రెండేళ్లలో రూ.2,250 కోట్లు ఖర్చు చేసి పనులను వేగవంతం చేశాం. ఎన్టీఆర్ ప్రారంభించిన అనేక ప్రాజెక్టులను పూర్తి చేసే అవకాశం నాకు దక్కింది” అని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో 50 శాతం లోటు వర్షపాతం ఉందని, శ్రీశైలం, నాగార్జున సాగర్‌లకు నీళ్లు రాని క్లిష్ట పరిస్థితుల్లోనూ వెలిగొండకు నీరివ్వాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని చంద్రబాబు వివరించారు. “2019లో మేం అధికారంలోకి వచ్చి ఉంటే 2021 నాటికే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, డ్రామాల వల్లే ఇంత జాప్యం జరిగింది” అని ఆయన విమర్శించారు.

పోలవరం పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీరందించి, శ్రీశైలంలో నీటిని పొదుపు చేయడం ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప, రాయలసీమ ప్రాంతాలకు నీరివ్వవచ్చని సీఎం తెలిపారు. దేశంలో నీటి భద్రత సాధించేందుకు గంగా-గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేయాలని సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదించినట్లు వెల్లడించారు. ఈ ఐదు నదుల అనుసంధానంతో నాలుగు రాష్ట్రాల నీటి సమస్యలు తీరతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

స్థానిక అభివృద్ధిపైనా చంద్రబాబు పలు హామీలిచ్చారు. మార్కాపురం జిల్లాలో జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతీ ఇంటికి కుళాయి నీరు అందిస్తామని, పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. సెప్టెంబరులో హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేస్తామన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసినా, ‘సూపర్ సిక్స్’ వంటి పథకాలను అమలు చేస్తూనే, అభివృద్ధి, ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.