Take a fresh look at your lifestyle.

22ఏ భూములపై సర్కార్‌ కీలక నిర్ణయం.. సమస్యలకు చెక్‌ పెట్టేలా హైలెవల్‌ కమిటీ!

0 7
  • ఛైర్మన్‌గా సీసీఎల్‌ఏ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌
  • ఇద్దరు ఉన్నతాధికారులు సభ్యులుగా నియామకం
  • భూ యజమానుల విజ్ఞప్తుల పరిశీలన
  • క్షేత్రస్థాయి సమస్యలపై కమిటీ దృష్టి
  • పరిష్కారానికి కార్యాచరణ రూపొందించనున్న కమిటీ

తెలంగాణలో సెక్షన్‌ 22-ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాకు సంబంధించి భూ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పెండింగ్‌ విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కరించేందుకు హైలెవల్‌ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ముగ్గురు ఉన్నతాధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. సీసీఎల్‌ఏ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ను కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. లా సెక్రటరీ పాపిరెడ్డి, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఐజీ రాజీవ్‌ గాంధీ హనుమంతు సభ్యులుగా ఉంటారు.

22-ఏ నిషేధిత భూముల జాబితాలో ఉన్న అంశాలను కమిటీ సమగ్రంగా పరిశీలించనుంది. భూ యజమానులు ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యలు, వారి విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కారానికి అవసరమైన కార్యాచరణను రూపొందించనుంది.

ఏళ్లుగా నిషేధిత జాబితాలో భూములు ఉండటంతో వాటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్ల విషయంలో పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీపై భూ యజమానుల్లో ఆశలు నెలకొన్నాయి. సమస్యలను వేగంగా పరిశీలించి పరిష్కారం చూపే దిశగా కమిటీ పనిచేయనుంది.

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించగా, తాజాగా ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.