కొడంగల్ (మెట్రో న్యూస్):
- దేశానికే దిక్సూచిగా తెలంగాణను తీర్చదిద్దుదాం
- రెండేళ్లు అంకితభావంతో పనిచేయండి
- దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది
- ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు
- టీచర్ల సమస్యలన్నీ పరిష్కరిస్తా
![]()
రెండేళ్లు డెడికేటెడ్గా విద్యార్థుల కోసం పనిచేయాలని రాష్ట్రంలోని టీచర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశ విద్యావ్యవస్థకు దిక్సూచీగా తెలంగాణాను తీర్చిదిద్దుదాం అని పిలుపునిచ్చారు. రెండేళ్లు నాకు సమయం ఇవ్వండి.. ఆర్ధిక వెసులుబాటునుబట్టి మీ సమస్యలు పరిష్కరిస్తా… టీచర్లు రోడ్డెక్కితే రాష్ట్రానికి శుభసూచకం కాదు… రెండేళ్ల తరువాత మీరు ఆశించినట్లుగా సమస్యలు పరిష్కరించకుంటే.. ఎన్నికల పరీక్షలో ఎన్ని మార్కులు వేయాలో మీరే నిర్ణయించుకోండి అని అన్నారు. శనివారం కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళౄశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రైవేటుగా ధీటుగా నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. రాజకీయ నాయకుల ఉచ్చులో పడకండి… పదేళ్లు విద్యా వ్యవస్థను విధ్వంసం చేశారు. విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపిద్దాం.. అది మీ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని తెలిపారు.
ఉపాధ్యాయులకు ఎలాంటి చిన్న సమస్య కూడా రాకుండా చూసుకునే బాధ్యత నాది… పాలిటెక్నిక్ విషయంలో జరుగుతున్న అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దు. మిమ్మల్ని అడ్డుపెట్టుకుని మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారు. దయచేసి అలాంటివారి ట్రాప్లో పడొద్దు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ప్రత్యేక సలహాదారు కేశవరావుతో మీ సమస్యలు చెప్పుకోవచ్చు. విద్యార్థుల భవిష్యత్ కు పునాదులు వేసేది ఉపాధ్యాయులే. తల్లిదండ్రులకంటే విద్యార్థులు ఉపాధ్యాయుల వద్దనే ఎక్కువ సమయం గడుపుతారు. విద్యాభివృద్ధిలో గతంలో 28 వ స్థానంలో ఉంటే ప్రజా ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక 17 వ స్థానానికి చేరుకుంది. ఇది ఉపాధ్యాయుల కృషితోనే సాధ్యమైంది. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని సీఎం పేర్కొన్నారు.
