Take a fresh look at your lifestyle.

విజయవాడలో హై అలర్ట్.. బస్సులో డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం

0 3
  • విజయవాడ ఆర్టీసీ బస్సులో పేలుడు పదార్థాల కలకలం
  • 46 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • ప్రయాణికుడి అప్రమత్తతతో వెలుగులోకి వచ్చిన ఘటన
  • నరసరావుపేట నుంచి వచ్చిన బస్సులో అనుమానిత బ్యాగ్ గుర్తింపు
  • సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు ముమ్మరం

విజయవాడ నగరంలో పేలుడు పదార్థాలు లభించడం తీవ్ర కలకలం రేపింది. నరసరావుపేట నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సులో భారీగా పేలుడు పదార్థాలు వెలుగుచూశాయి. ఓ ప్రయాణికుడి అప్రమత్తతతో ఈ విషయం వెలుగులోకి రావడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆసిఫ్ అలీ అనే ప్రయాణికుడు నరసరావుపేట నుంచి విజయవాడకు బస్సులో ప్రయాణించారు. బస్సు దిగిన తర్వాత, ఆయన పొరపాటున తనది కాని వేరే బ్యాగును తీసుకున్నారు. కొంత సమయం తర్వాత ఆ బ్యాగును తెరిచి చూడగా, అందులో పేలుడు పదార్థాలు ఉండటాన్ని గమనించి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే సమీపంలోని బస్టాండ్ పోలీస్ అవుట్ పోస్టుకు వెళ్లి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ బ్యాగును స్వాధీనం చేసుకుని పరిశీలించగా, అందులో 46 జిలెటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను రప్పించి బస్సుతో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఈ ఘటనపై కృష్ణలంక ఎస్సై గిరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పేలుడు పదార్థాలను ఎవరు తీసుకొచ్చారు, వీటిని ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. బస్టాండ్‌లోని సీసీటీవీ ఫుటేజీలను, ప్రయాణికుల వివరాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సమాచారం అందించిన ప్రయాణికుడు ఆసిఫ్ అలీని అధికారులు అభినందించారు. ఈ ఘటన నేపథ్యంలో నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.